AP ASSEMBLY: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం (మూడో రోజు) ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్పై సభలో చర్చ రచ్చరచ్చయింది. రుషికొండపై నిర్మాణాలకు రూ. 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. అక్కడకు ఎవరిని వెళ్లనీయలేదని, ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తరువాత సమాధానం వచ్చిందంటూ సభ దృష్టికి తెచ్చారు. జగన్ కావాలనే రుషికొండ రిసార్ట్స్ను డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్లను కూల్చేసి ఏమి కడుతున్నారో ప్రజలకు చెప్పలేదని రాజు ఆరోపించారు. 1.40 లక్షల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి రూ. 451 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.
రూ. 409 కోట్ల వ్యయం చేస్తే 22, 743 మంది పేదలకు ఇల్లు కట్టవచ్చునన్నారు. ఫర్నిచర్కే రూ. 22 కోట్లు వ్యయం చేశారంటూ రచ్చచేశారు. టూరిజం రిసార్ట్ గా ముందు చెప్పి అనంతరం జీవో ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ను వెతికేందుకు ఒక కమిటీ వేసి రుషికొండ ప్యాలెస్ను సిఎంకు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసిందని, బాత్ రూంలో కమ్ ఔట్ ఖరీదు రూ. 16 లక్షలు అంట అని విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన కమ్ ఔట్కు రూ.11 లక్షలు ఖర్చు అయిందని, ఈ కమ్ ఔట్లో స్పెషాలిటీ ఏమిటి అని అడిగితే ఆటో వాషింగ్ అని చెప్పారని, నాప్కిన్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పారని విష్ణుకుమార్ రాజు అన్నారు. స్నానం చేసేటప్పుడు 3 వే మిక్సింగ్ షవర్ ఖరీదు 4 లక్షల 3 వేల రూపాయలని, మెయిన్ డోర్ ఖరీదు రూ. 24 లక్షలు, డోర్కు ఉండే గ్రిల్ రూ. 12 లక్షలు, మార్బుల్ ఫ్లోరింగ్ చదరపు మీటరు రూ.37 వేల 706. కళింగ బ్లాక్లో మెయిన్ డోర్, గ్రిల్ కలిపి రూ.57 లక్షలు, వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ చదరపు మీటరుకు తెల్ల మార్బుల్ రూ.79 వేలు ఖర్చు చేశారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ క్రమంలో రేపు (శుక్రవారం) జీరో అవర్ను రద్దు చేసి దీనిపై చర్చ పెడదామని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ… ఈ రోజు తాను కూడా మాట్లాడుతానని… తనకు రేపు అవకాశం ఉండదని ఆయన అన్నారు. రేపు మళ్ళీ జీరో అవర్ ఉండదు కదా అన్న రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలకు స్పీకర్ అంగీకరించారు. మళ్లీ విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఏమి చేయనిదానికి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని, తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా బాధపడ్డారని అన్నారు. మరి ఇంత దుర్వినియోగం చేసిన జగన్ జీవిత కాలం జైలులో ఉంచాలి కదా అని విష్ణు కుమార్ రాజు అన్నారు.