Medical: తెలంగాణ వైద్య విద్యార్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. వైద్యవిద్య ప్రవేశాలకు గడువు దగ్గరపడుతున్నా స్థానికత విషయంపై స్పష్టత రాకపోవడం అభ్యర్థులను కలవర పెడుతోంది. మే 5న నీట్( నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించనున్నారు. అలాగే, జూన్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల జారీ తర్వాత కేవలం 15 రోజుల్లోనే ప్రవేశాల కౌన్సిలింగ్ విధానం ఆరంభమవుతుంది. సమయం దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానికతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
విభజన చట్టం(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశమిచ్చింది. అయితే ఈ గడువు జూన్ 2తో ముగియనుంది. ఆ తర్వాత ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెన్స్(ప్రవేశాలు) స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది గనుక స్థానికత విషయంపై ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థి ఎక్కడ చదివితే అదే లోకల్(స్థానికత)గా గుర్తించారు. ఆ పద్ధతిలోనే ఆయా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం స్థానికతమై ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. ఇప్పుడున్న పద్ధతినే అనుసరిస్తుందా.. లేక మరేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుందా.. లేదంటా ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం దీనికి ఒక స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే తాము తావ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
ఎన్నికల బిజీలో సర్కారు…
ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అంతా ఆ హడావుడిలో మునిగారు. అయితే ఈ స్థానికత అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలంటూ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ(Medical)జరగాల్సి ఉన్నా.. ఎన్నికల టెన్షన్లో ప్రభుత్వం దీనిపై అంతగా దృష్టి సారించలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై కసరత్తు ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మాయలోపడి స్థానికతను విస్మరిస్తే 400 నుంచి 500 వరకు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయే అవకాశముందని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై ఓ స్పష్టతకు రావాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో మొత్తం 3,112 పీజీ, 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిని ఉన్నత విద్య సంస్థలు భర్తీ చేస్తాయి.