• ఒక్కరోజే వడ దెబ్బతో ఎంత మంది మృతో తెలుసా..

హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 9 దాటిందంటే ఇల్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలాఉంటే తెలంగాణలో ఒక్క శుక్రవారమే ఎనిమిది మంది వడదెబ్బ (sun stroke) తో మృత్యు వాత పదారు. పెద్దపెల్లి జిల్లా బసంత్‌నగర్‌లోని సిమెంట్‌ ప్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్‌ హుస్సేన్‌(59) సిమెంట్‌ బస్తాల లోడ్‌తో లారీని కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి వస్తుండగా, ఎండకు తట్టుకోలేక రహదారి పక్కన లారీని నిలిపి నీరు తాగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో మల్లీ కల్పన (24) వివిఽధపనుల నిమిత్తం ఎండలో తిరగడంతో తెల్లవారుజామున తీవ్రఅస్వస్థతకు గురై మృతిచెందింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కర్రి రాజు(40) నల్లగొండ జిల్లాలో రామన్నపేట మండలం దుబ్బాకలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిట్యాలకు వచ్చిన రాజు తిరిగి రామన్నపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా, వడదెబ్బతో అక్కడే కుప్పకూలాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కళ్యాణం రామక్క (75) వేడికి తాళలేక రెండు రోజుల క్రితం అస్వస్థతకు మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం భీమయ్య (55) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం ఉదయం కూలీ పనులకు వెళ్లి ఇంటిక వచ్చిన భీమయ్య వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. స్థానిక వైద్యుడు పరీక్షించి భీమయ్య మృతి చెందాడని తెలిపాడు. నల్లగొండ జిల్లాలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన రేపాక ముత్తమ్మ (64) గుర్రంపోడు గ్రామ శివారులోని శెశిలేటివాగు వద్దకు నడుచుకుంటూ ఎండలో రాగా వడదెబ్బకు మృతి చెందింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని గోండు కొత్తగూడ పరిధిలోని నాగోబాగూడాకు చెందిన యువకుడు ఆత్రం లింబారావు(23) వడదెబ్బతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఆత్రం భుజంగ్‌రావు కుమారుడు లింబారావు వడదెబ్బకు గురికావడంతో ఉట్నూర్‌లోని హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో పశువుల కాపరి పల్లకొండ ఐలయ్య(75) తన పందులను మేపడానికి ఎండలో తీసుకెళ్లగా వడదెబ్బ(sun stroke ) తో మృతిచెందాడు.

జాగ్రత్తలు పాటించాలి..

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయని, అత్యవసరం ఐతే తప్ప ఎవరూ బయటకు రావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. జూన్‌లో నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశముందని, ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాడీ డీ హైడ్రేషన్‌ కాకుండా నిత్యం తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తువులు ధరించాలని, బొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *