LOCAL WAR : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, లక్షల రూపాయల్లో జీతాలు ఇచ్చే కంపెనీలు ఇప్పడు తలలు పట్టుకుంటున్నాయి. అసలు ఉద్యోగులకు స్కిల్ (నైపుణ్యం) లేకుండా ఉద్యోగాలు ఇస్తే కంపెనీలు ఎలా నడుస్తాయని ఆయా కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దేశ, విదేశీ కంపెనీలను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ ఆకర్షిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు తిరకాసు పెడుతున్నాయి. ఉద్యోగాలు మాత్రం స్థానిక నిరుద్యోగులకు మాత్రమే ఇవ్వాలని షరతు విధిస్తుండడంతో పలు కంపెనీలు తిరుగుముఖం పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు స్థానికతకు కొంత శాతం రిజర్వేషన్ కోరుతుంటే, కొన్ని స్టేట్స్ మాత్రం పూర్తి స్థాయిలో లోకల్ వారికే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో దేశ వ్యాప్తంగా కొత్త చిక్కులు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఏకంగా చట్టం చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులు, కంపెనీలు ఏమో స్థానికత కాకుండా ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ , హర్యానా రాష్ట్రాలు చట్టం తీసుకురాగా, ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచేందుకు సమాయత్తమవుతున్నాయి.
లోకల్ చట్టం దిశగా కర్నాటక
తాజాగా కర్నాటక లోకల్ చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ఈమేరకు క్యాబినెట్ ఆమోదం పొందగా, దీనిని చట్టం తీసుకువచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. దీని ప్రకారం ప్రయివేట్ కంపెనీలు మేనేజ్మెంట్ స్థాయిలో 50శాతం, నాన్ మేనేజ్మెంట్ స్థాయిలో 75 శాతం లోకల్ రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, గ్రూప్ సీ, డీ స్థాయిలో వంద శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా మరోసారి స్థానికత చర్చనీయాంశమైంది. నిరుద్యోగుల్లో చిచ్చును రేపుతోంది.
ఇప్పటికే చట్టం చేసిన జగన్ ప్రభుత్వం..
తాజాగా కర్నాటక లోకల్ చట్టం (LOCAL WAR )చేసేందుకు రెడీ అవుతుండగా, ఇప్పటికే తెలుగురాష్ట్ర మైన ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే చట్టం చేయడం విశేషం. వైఎస్ జగన్ ప్రభుత్వం ది ఆంధ్ర ప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీ యాక్ట్ -2019 తీసుకువచ్చింది. 2019 జూలై 24న ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం కూడా పొందింది. దీని ప్రకారం కర్మాగారాలు, ఫ్యాక్టరీ, జాయింట్ వెంచర్స్, పబ్లిక్, ప్రయివేట్ పార్టనర్ షిప్ కింద ఏర్పాటు చేసే ప్రతీ ప్రాజెక్ట్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై అప్పటికే నిరుద్యోగులు, వివిధ విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని గగ్గోలు పెట్టాయి. కోర్టులను సైతం ఆశ్రయించాయి.
-
ఆర్టికల్ 16లోని క్లాజ్-4కు పదును..
- ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లోని క్లాజ్-4ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విమర్శలు దేశ వ్యాప్తంగా భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్లాజ్ ప్రకారం సామాజికంగా, విద్య పరంగా ఏదైనా వర్గానికి ప్రాతినిధ్యం సరిగాలేని సందర్భంలో సర్కారు వారికి రిజర్వేషన్ను కల్పించవచ్చు. ఇదే అదునుగా భావించి ఆయా రాష్ట్రాలు భవిష్యత్తును ఆలోచించకుండా తమకు అనువుగా మలుచుకుంటున్నాయనే విమర్శలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఆర్టికల్ 19(1)(జీ) ప్రకారం ప్రతీ వ్యక్తి తనకు నచ్చిన ఉద్యోగం చేసుకునే హక్కుకు భంగం కలిగిట్టేనని మేధావులు పేర్కొంటున్నారు.
-
నైపుణ్య పోస్టులు లక్షల్లో ఖాళీలు..
దేశ వ్యవాప్తంగా వృత్తి నైపుణ్య పోస్టులు లక్షల్లో ఖాళీలు ఉన్నట్టు మేధావులు పేర్కొంటున్నారు. నేషనల్ కెరీర్ సర్వీసెస్ ప్రకారం గత ఏడాది 46.86లక్షల ఉద్యోగాలు అవసరం ఏర్పడగా, ఇందులో కేవలం 27.05లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని చెబుతోంది. ఇదే అవిషయాన్ని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు మాత్రం నైపుణ్యం లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదంటూ స్పష్టం చేస్తున్నాయి. అవసరమైనతే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు వెనుకాడడం లేదని పేర్కొంటున్నాయి.