CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఆంధ్రా, బిహార్ ప్రత్యేక బడ్జెట్లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. చాలా రాష్ట్రాలదీ ఆదే పరిస్థితి అని మేధావులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కనీస చూపు చూడకపోవడం తెలంగాణ వాసులు భగ్గుమంటున్నారు. కేంద్రంలో ఎవరు ఉన్నా, రాష్ట్రానికి మొండి చేయి చూపడం ఆనవాయితీగా వస్తోందని ఆగ్రహిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ అదే జరిగిందని పేర్కొంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లను గెలిపిస్తే బడ్జెట్లో కనీసం తెలంగాణ పేరు కూడా ఉచ్చరించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇది కుర్చీ బచావో బడ్జెట్. ఇది కేంద్ర బడ్జెట్లా లేదు. ఆంధ్రప్రదేశ్, బిహార్కు సంబంధించిన ప్రత్యేక బడ్జెట్లా ఉంది’ అంటూ ధ్వజమెత్తారు. బడ్జెట్లో తెలంగాణకు దక్కింది శూన్యమని, కేంద్రం రాష్ట్రానికి గుండు సున్నా చూపిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణపై మరోసారి వివక్ష
రాజకీయ ఎత్తుగడలు ఏమైనా ఉండొచ్చుగాక, కానీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణపై వివక్ష చూపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మేధావులను తెలుస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం కోరిన ఏ ఒక్కదానికీ ప్రత్యేక గ్రాంట్లను పట్టించుకోలేదు. గతం నుంచి కోరుతున్న డిమాండ్లను విస్మరించింది. కనీసం విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కూడా బడ్జెట్(CENTRAL BUDGET)లో ప్రస్తావించకపోవడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మేధావులు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. అదే పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణ మాత్రం ప్రస్తావించలేదని విమర్శిస్తున్నాయి.
పాలమూరు ప్రాజెక్టుకు మొండిచేయి..
కేంద్రం ఈసారి కూడా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను కనీస లెక్కలోకి తీసుకోలేదు. అదే ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కోసం నిధులను మంజూరు చేస్తామన్న ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోరినా పట్టించుకోలేదు. కనీసం ‘పాలమూరు–రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టింది.
హైదరాబాద్పై చిన్నచూపు..
దేశానికి రెండో రాజధానిగా తరచూ చర్చలోకి వచ్చే హైదరాబాద్పై కూడా కేంద్రం చిన్నచూపు చూసింది. సబర్మతి రివర్ ఫ్రంట్, నమామీ గంగ తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు తగిన నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. రూ.లక్షన్నర కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు సాయం చేయాలని రాష్ట్రం కోరింది. దీనికి ఎలాంటి గ్రాంటునూ ప్రకటించలేదు. మరోవైపు హైదరాబాద్–నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఊసెత్తలేదు.
గత డిమాండ్లూ పట్టించుకోలే..
తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం పలు హామీలు ఇచ్చింది. ఇందులో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్. కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఓవర్హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు నిరుడు రైల్వే శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాటేలేదు. హైదరాబాద్కు ప్రతిపాదించిన ‘సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్)’, తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ను ఏర్పాటునూ గాలికొదిలేసింది. తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయానికి నిధుల మాటేలేదు.
బీజేపీ మాటేమిటి..
తెలంగాణ రానున్నది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఇన్నాళ్లు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చెబుతారంటూ ఇతర పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతల మాటలు నమ్మి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే, కనీసం తెలంగాణ పేరు కూడా ఉచ్చరించకపోవడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బడ్జెట్పై తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి జనానికి ఏం ముఖం చూపించాలంటూ వాపోతున్నట్టు సమాచారం.