భూపాలపల్లి: లంచం తీసుకుంటూ ఒక అధికారి, ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌ సముదాయంలోని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్‌ అధికారితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు పట్టుబట్టారు. ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి (ఉమ్మడి వరంగల్‌)జిల్లా పరిధిలోని మల్హర్‌ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన కుంట సదానందం స్థానిక వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఆయన కాంట్రాక్టర్‌ కూడా పనిచేస్తున్నాడు. రూ.10లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో సీసీ రోడ్డు పనులు కూడా చేశాడు. మొత్తం బిల్లులో రూ. 5.83లక్షలు బిల్లులు అందగా, మరో రూ.4.17లక్షలు పెండింగ్‌లో ఉంది. దీనికోసం ఏఈ ఇన్‌బుక్‌ రికార్డు చేసి ఈఈకు ఫైలు పంపించారు. ఈ ఫైల్‌ పరిశీలించి, పాస్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు ఈఈ సంపతి దిలీప్‌కుమార్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (ఏటీవో) తహలాల చంద్రశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ వల్గుపదాసు శోభారాణి ముగ్గురు కలిసి రూ.20వేలు డిమాండ్‌ చేశారు. వారి డిమాండ్‌కు సదరు కాంట్రాక్టర్‌ సదానందం అంగీకరించాడు. అయినా, వారు కాలయాపన చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పనిచేయాలని కోరగా, ముందుగా డబ్బులు చెల్లిస్తేనే పని పూర్తి అవుతుందని వారు తేల్చి చెప్పాడు. వారి చేష్టలకు వినిగిన సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు పథకం ప్రకారం ముగ్గురికి సదానందం డబ్బులు ఇస్తుండగానే ఆకస్మిక దాడులు చేసి ఈఈ దిలీప్‌కుమార్‌, ఏటీవో చంద్రశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శోభారాణిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

ఇదిలాఉండగా, కలెక్టరేట్‌లోని పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసిన క్రమంలో సుమారు గంటన్నర పాటు సోదాలు చేసినట్టు తెలిసింది. కార్యాలయంలోని అందరి వివరాలను సేకరించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *