JOHNY MASTER: హైద‌రాబాద్‌: షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసులో జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండు వారాల నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. అయితే ఆయన ఇటీవల నేషనల్‌ అవార్డు రావడంతో బెయిల్‌ ఇవ్వాలని జానీ కోర్టును ఆశ్రయించారు. అవార్డు అందుకునేందుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ కూడా ఇచ్చింది. ఇది ఇలా ఉండగా పోక్సో కేసు నమోదైన కారణంగా జానీకి ఇచ్చిన నేషనల్‌ అవార్డును నిలిపివేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్‌ కోసమే మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. తీరా అది చేజారింది. కాగా, తాజాగా మరోసారి తనకు బెయిల్‌ కోసం జానీ న్యాయస్థానాన్ని ఆశయ్రించారు. ఆయన అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. కానీ అతడికి పలు రకాల షరతులు విధిస్తూ బెయిల్‌ను ఇచ్చింది.

జానీ మాస్టర్‌ (JOHNY MASTER) తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 సంవత్సరంలో ఓ సినిమా షూటింగ్‌ కోసం ముంబై వెళ్లినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనకు జానీ, 2017లో నుంచి పరిచయం ఉందని, 2019లో సినిమా చిత్రీకరణ కోసం వెళ్లి, ఓ హోటల్‌లో బస చేసినట్టు తెలిపింది. అక్కడే జానీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికి చెప్పొదని, చెబితే పని నుంచి తీసేస్తానని బెదిరించాడని పేర్కొనట్టు పోలీసులకు పేర్కొంది. ఆ తర్వాత హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అత్యాచారం , పోక్సో సెక్షన్ల కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న జానీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది.

తెలుగు, కన్నడ,తమిళం, హిందీ తదితర భాషా చిత్రాలో జానీ కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. జానీ మూడు ఫిలీం ఫెయిర్‌, మూడు సైమా అవార్డులను అందుకున్నారు. ఇటీవల నేషనల్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు అందకోక ముందే ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్‌ అవార్డుకు దూరం కావాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జానీ మాస్టర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *