warangal lok sabha constituency

-కాంగ్రెస్‌ తమ అభ్యర్థినే నిలిపే యోచన?

warangal lok sabha constituency | దేశంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ పరిణామాలతో పొత్తుల పార్టీల్లో అయోమయం నెలకొంటోంది. పొత్తులో భాగంగా ఏ సీటు ఏ పార్టీకి పోతుందోనని ఆశావహులు జంకుతున్నారు. వరంగల్‌ పార్టమెంట్‌(ఎస్సీ)లో రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠను రేపుతున్నారు. తెలంగాణలో అత్యధిక మెజారిటీ సాధించిన స్థానాల్లో ఒకటిగా వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీటుపై చర్చ అప్పుడే మొదలైంది. ఈసారి ఈ స్థానం నుంచిపోటీ చేసేందుకు సీపీఐ పట్టుబడుతోంది. ఇదిలాఉంటే వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని వరంగల్‌ తూర్పు, స్టేషన్‌ఘనపూర్‌, పరకాల, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో తాజాగా 18లక్షల 16వేల 543 మంది ఓటర్లు ఉన్నారు.

సీపీఐ ముఖ్యనేతలకు మొర..

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్‌, సీపీఐ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇదే ఉత్సాహంతో ఈసారి వరంగల్‌ ఎంపీ టికెట్‌ భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి కేటాయించాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. దేశంలో ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో సీపీఐ కూడా ఉండడంతో ఎలాగైనా వరంగల్‌ సీటు సాధించాలని భావిస్తోంది. సీటు పార్టీకే దక్కేలా చూడాలని వరంగల్‌ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కలిసి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి ఆయన సానుకూలంగానే స్పందించినట్టు నేతలు చెబుతున్నారు.

పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం..

పొత్తులో భాగంగా ఈసారి వరంగల్‌ ఎంపీ సీటు సీపీఐ పట్టుబడుతుండడంతో కాంగ్రెస్‌ కూడా తమకే ఈసీటు కావాలని బెట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా సీపీఐకి సీటు కేటాయిస్తే ఓటమి చవిచూడాల్సి వస్తుందని, కాంగ్రెస్‌ కచ్చితంగా గెలిచే సీటుగా అధిష్ఠానం భావిస్తుండడంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థినే బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా సీఎం కేసీఆర్‌ కూడా ఈ సీటును దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎంపీ పార్టమెంట్‌ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం అంతగా లేకపోవడంతో సీపీఐకి కేటాయించినా లాభం ఉండదనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలూ అదే రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి సిటింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌(బీఆర్‌ఎస్‌) ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఈసారి కూడా అయన్నే కాంగ్రెస్‌ అధిష్ఠానం బరిలో నింపే యోచనలో భాగంగా పార్టీలోకి ఆహ్వానించిందా అనుమానమూ లేకపోలేదు. 2019 ఎంపీ ఎన్నికల్లో 57శాతం ఓట్లతో 3.50లక్షల పైచిలుకు మెజారిటీతో దయాకర్‌ గెలుపొందారు. మళ్లీ అతడిని బరిలో దింపితే సానుకూల ఫలితం వచ్చే అవకాశముందని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా కేటాయించాల్సి వస్తే వరంగల్‌కు బదులు మరో సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాయి.

సీపీఐకి మొండి చేయేనా…

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీపీఐకి వరంగల్‌ కేటాయింపు దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బట్టి సీటు కేటాయించే పనిలో కాంగ్రెస్‌ ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఖరారు చేయడం జరిగింది. బీజేపీ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను బరిలో దింపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. స్థానికంగా బలమైనా నాయకుడిగా ఉండడంతో బీజేపీ అతడికే టికెట్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరిని ఢీ కొట్టే నాయకుడి అన్వేషణలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఇదిలాఉంటే తనను సీఎం చేసినందుకు రేవంత్‌ రెడ్డి ప్రతిగా సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీపీఐకి టెకెట్‌ ఇవ్వడం సాధ్యమేనా? .. ఏమో పరిస్థితి అనుకూలించి సీపీఐకి టికెట్‌ ఇస్తారా వేచిచూడాలి.

2 thought on “వరంగల్‌ ఎంపీ సీటు సీపీఐకు లేనట్టేనా..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *